తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై మిస్టరీ వీడలేదు. ప్రస్తుతం అమ్మ మృతిపై విచారణ కమిటి నియమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలితకు హల్వాను తినిపించి హత్య చేశారని ఆరోపించారు.
జయలలిత మరణంపై ఆర్ముగస్వామి కమిషన్ విచారణ జరుపుతున్న వేళ, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణన్ ఇచ్చిన వాంగ్మూలం అవాస్తవమని చెప్పారు. జయది ముమ్మాటికీ హత్యేనని నొక్కి చెప్పారు.
మరణించే చివరి రోజుల్లో జయలలితకు చికిత్స చేసిన అపోలో యాజమాన్యానికి అనుకూలంగా రాధాకృష్ణన్ వ్యవహరిస్తున్నారని, కొందరిని రక్షించే ప్రయత్నం ఆయన చేస్తున్నారని అన్నారు.
జయలలిత ఆసుపత్రిలో కోలుకుంటున్న వేళ, స్లో పాయిజన్గా తీయటి పదార్ధాలను ఇవ్వడం ప్రారంభించారని, ప్రధానంగా హల్వా పెట్టారని ఆరోపించారు. ఆమెకు షుగర్ వ్యాధి ఉండటంతో దాన్ని అలుసుగా తీసుకుని షుగర్ పదార్ధాలు పెట్టి, ఆమెకు గుండెపోటు వచ్చే విధంగా పరిస్థితి విషమించేలా చూశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తమిళనాట కలకలం రేపాయి.