ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌‌షిప్ నుండి ఇంటిబాట పట్టిన పీవీ సింధూ.

0
148

ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌‌షిప్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. టోక్యో 2020 ఒలింపిక్స్ ముంగిట భారీ అంచనాల నడుమ టోర్నీలోకి అడుగుపెట్టిన సింధు.. వరుస విజయాలతో క్వార్టర్స్‌కి చేరింది. కానీ.. క్వార్టర్స్‌లో జపాన్ అగ్రశ్రేణి షట్లర్ నొజొమి ఒకుహర చేతిలో పేలవంగా ఓడిపోయిన సింధు.. ఇంటిబాట పట్టింది. వాస్తవానికి పీవీ సింధూకి ఒకుహరపై మెరుగైన గెలుపు రికార్డ్‌ ఉండటంతో మ్యాచ్‌లో గెలుస్తుందేమో..? అని అంతా ఊహించారు. ఈ క్రమంలో తొలి సెట్‌ని 21-12 తేడాతో సింధు గెలుపొందింది. కానీ.. రెండో సెట్‌లో అనూహ్యంగా తడబడి 15-21 తేడాతో చేజార్చుకున్న సింధు.. నిర్ణయాత్మక మూడో సెట్‌లోనూ పుంజుకోలేకపోయింది. ఎంతలా అంటే..? ఆఖరి సెట్‌లో ఒకుహర ఒకానొక దశలో 19-10తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. చివరికి మూడో సెట్‌ని 21-13తో ముగించిన జపాన్ షట్లర్.. మ్యాచ్‌ని అలవోకగా చేజిక్కించుకుంది.

ఒకుహరతో ఇప్పటి వరకూ 17 మ్యాచ్‌ల్లో తలపడిన పీవీ సింధు.. 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇక మిగిలిన 8 మ్యాచ్‌ల్లో పరాజయాన్ని చవిచూసింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? పీవీ సింధు తన క్వార్టర్స్ మ్యాచ్‌కి ముందు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకి ఫోన్ చేసి.. కరోనా వైరస్ నేపథ్యంలో టోర్నీలో ఆడాలా..? వద్దా..? అంటూ సలహా కోరింది. కానీ.. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మ్యాచ్‌లో ఓడి ఇంటిబాట పట్టింది.