ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ చూడటానికి హాజరైన ఓ అభిమానికి కరోనా వైరస్.

0
231

ఆస్ట్రేలియా గడ్డపై గత ఆదివారం జరిగిన ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కి హాజరైన ఓ అభిమానికి కరోనా వైరస్ ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ ఫైనల్ మ్యాచ్‌ జరగగా.. 85 పరుగుల తేడాతో గెలుపొందిన ఆతిథ్య జట్టు ఐదోసారి టైటిల్‌ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రికార్డు స్థాయిలో 86,174 మంది అభిమానులు మెల్‌బోర్న్ స్టేడియానికి వచ్చారు. అయితే.. స్టేడియంలోని లెవల్ 2 నార్త్‌ స్టాండ్‌లోని సెక్షన్ 42లో కూర్చున్న అభిమానికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలడంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. దీంతో.. ఆ స్టాండ్‌లో కూర్చున్న వారు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించిన వైద్యాధికారులు.. ఏదైనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఆ ప్రభావం క్రీడలపై కూడా పడుతుండటంతో.. చాలా ఫుట్‌బాల్ టోర్నీలు ప్రేక్షకులు లేకుండానే కొనసాగుతున్నాయి. ఇక భారత్‌లోనూ ఇప్పటికే పాజిటివ్ కేసులు 70కి చేరగా.. ఐపీఎల్ 2020 సీజన్‌ మ్యాచ్‌లు జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా పర్యాటక వీసాల్ని రద్దు చూస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభావం ఐపీఎల్‌పైనా పడనుంది.