ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని అమెరికాతో సహా అనేక దేశాలు హుకుం జారీచేశాయి. దీంతో పాకిస్థాన్ సర్కారు రంగంలోకి దిగింది. ఇందులోభాగంగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అజర్, కుమారుడు హమ్మాద్ అజర్ను పాక్ పోలీసులు అరెస్టు చేశారు.
అబ్దుల్ రౌఫ్తోపాటు నిషేధిత సంస్థలకు చెందిన హమద్ అజర్ సహా 44 మందిని పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. ఈ మేరకు మార్చి 4వ తేదీన అంతర్గత వ్యవహరాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. జాతీయ భద్రతా కమిటీ (ఎన్ఎస్సీ) నిర్ణయం ప్రకారం.. నేషనల్ యాక్షన్ ప్లాన్ (ఎన్ఏపీ) లో భాగంగా అన్ని నిషేధిత సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఫలితంగానే వీరందరినీ అరెస్టు చేశారు. నిషేధిత సంస్థలపై చర్యలు కొనసాగుతాయని అంతర్గత వ్యవహారాల శాఖ సహాయ మంత్రి షెహ్ ర్యార్ అఫ్రిది తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి విచారణ కొనసాగిస్తాం. ఒకవేళ వారు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే.. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా, పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ బహవల్పూర్ గ్రామానికి చెందిన మసూద్ అజర్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను 2000 సంవత్సరంలో ప్రారంభించాడు. ఈయన తన కార్యకలాపాలను పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని బాలాకోట్ కేంద్రంగా సాగిస్తున్నాడు. ఈ కేంద్రాన్నే భారత వైమానికదళం మెరుపుదాడులు నిర్వహించి నేలమట్టం చేసింది.