తనని రెచ్చగొడితే అన్నయ్య.. దివంగత ఎన్టీఆర్కు చేసిన మోసాలు, జరిగిన ఘోరాలను బయటపెడ్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నటుడు మోహన్బాబు హెచ్చరించారు. తన కుటుంబంపై చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మొదలుపెట్టారని ఆయన ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడిగితే చెప్పే ధైర్యం లేక జోకర్ల చేత మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితం తెరిచిన పుస్తకమని మోహన్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మోహన్ బాబు వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఘాటుగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు మోహన్ బాబుకు లేదన్నారు. మీడియా సమావేశంలో యామిని మాట్లాడుతూ, విద్యా సంస్థలు నడుపుతున్న కొందరు చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదంటూ ‘మంచు’ కుటుంబంపై విమర్శలు చేశారు.
మంచు కుటుంబం బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని, చంద్రబాబును విమర్శించే ముందు వారి స్థాయి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. సంక్షోభంలో ఉన్న ఏపీకి చంద్రబాబు వంటి సమర్థ నాయకత్వం అవసరమన్న యామిని, రాష్ట్రాభివృద్ధి కోసం జగన్కు స్పష్టమైన ప్రణాళికలు, విజన్ లేవని విమర్శించారు.