ఫణి తుఫాను… భగ్గుమంటున్న తెలుగు రాష్ట్రాలు

0
52

ఫణి తుపాను అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. వాతావరణంలోని తేమను ఫణి తుపాను లాగేసుకోవడంతో వాతావరణం అత్యంత పొడిగా మారిపోయింది. దానికి తోడు భానుడి భగభగలు, పశ్చిమం నుంచి వీస్తున్న వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రకాశం జిల్లా దొనకొండలో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా జిల్లా జి.కొండూరులో 45.89 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో 52 ప్రాంతాల్లో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదు కాగా, 127 ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదైంది. ఆర్టీజీఎస్ ఇంతకుముందే ప్రజలకు వడగాడ్పుల హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే.

అలాగే తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగమంటున్నాడు. బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. వారం రోజుల నుంచి ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. వారం రోజుల్లో వడదెబ్బకు సుమారు 8 మంది మృతి చెందినట్లు సమాచారం. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా మొత్తం 46 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతోంది. ఉదయం 6-30 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర మినహా కోస్తా, రాయలసీమల్లో భారీ ఉష్ణోగ్రతలు కొనసాగాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వడగాల్పులు పెరిగాయి.