అమరావతి: పేదలకు భారమైన ఆరోగ్యంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించనుంది. మధ్యతరగతి కుటుంబాలకూ దీన్ని వర్తింపజేయనున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆయన శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ, 108, 104 సేవల విస్తరణను ప్రస్తావించారు. మాజీ సీఎం దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకాలు అనేక రాష్ట్రాలు అనుసరించాయని చెప్పారు. వీటితో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి, గిరిజన ఆరోగ్యం, కిడ్నీ రోగులకు సంబంధించి బడ్జెట్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
⇒ ఆరోగ్యశ్రీకి పూర్వ రూపు తీసుకొస్తామని బుగ్గన తెలిపారు. పేద వారికే పరిమితమైన ఈ పథకాన్ని మధ్యతరగతి వారికీ వర్తించేలా రూ.5లక్షలలోపు కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికీ వర్తింపజేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. వైద్య ఖర్చలు రూ.వెయ్యి మించిన అన్ని కేసులనూ ఈ పథకం తీసుకొస్తున్నట్లు తెలిపారు. చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితీ లేకుండా అన్ని కేసులకూ చికిత్స అందిస్తామని వివరించారు.
⇒ సరిహద్దు జిల్లాల ప్రయోజనం కోసం రాష్ట్రానికి వెలుపల ఉన్న బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లోని మంచి ఆస్పత్రులను ఈ పథకం జాబితాలో చేరుస్తామని తెలిపారు. అన్ని రోగాలు, సర్జరీలను దీని కింద తీసుకొస్తున్నట్లు చెప్పారు.
⇒ మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తామని, మొత్తంగా ఈ పథకం కోసం రూ.1740 కోట్లుకేటాయిస్తున్నట్లు బుగ్గన తెలిపారు.
⇒ ఫోన్ చేసిన 20 నిమిషాల్లోపే 108 సేవలు అందే విధంగా ప్రతి మండలంలో అంబులెన్సులు ఉండేలా చూస్తామని తెలిపారు. 432 అదనపు అంబులెన్సుల కోసం రూ.143.38 కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు.
⇒ 104 సేవల విస్తరణలో భాగంగా 676 వాహనాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించామని, అందుకోసం రూ.179.76కోట్లు ఖర్చు చేయనున్నట్లు బుగ్గన తెలిపారు.
⇒ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దేందుకు రూ.1500 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
⇒ రూ.66 కోట్లతో ప్రాథమిక వ్యయంతో పాడేరు/అరకు ప్రాంతాల్లో గిరిజన వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. పల్నాడులో సేవల కోసం గురజాల వద్ద ఒకటి, ఉత్తరాంధ్రలో సేవల కోసం విజయనగరంలో వైద్య కళాశాలలను నెలకొల్పాలని యోచిస్తున్నామని, ఇందు కోసం రూ.66 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
⇒ శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కోసం రూ.50 కోట్ల వ్యయం చేయనున్నట్లు తెలిపారు.
⇒ వెయ్యికి 74గా ఉన్న ప్రసూతి మరణాల రేటును 55కు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. శిశు మరణాలను 32 నుంచి 22కి తగ్గించాలని యోచిస్తున్నామని తెలిపారు.