యువతకు అడ్డాగా మారిన సంజీవయ్య పార్కును గురువారం నుంచి పిల్లల ఉద్యానంగా మార్చుతూ హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. ప్రేమికుల రాక వల్ల పార్కులోకి వచ్చే ఇతర సందర్శకులకు ఇబ్బందులు కలుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంజీవయ్య పార్కుతో పాటు హెర్బల్ పార్కు, సీతాకోక చిలుకల పార్కు, రోజ్ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటినీ ‘సంజీవయ్య పిల్లల ఉద్యానం’ పరిధిలోకి తెచ్చారు.
14ఏళ్ల లోపు పిల్లలు, వారి వెంట వచ్చే తల్లిదండ్రులు, సంరక్షకులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రవేశ రుసుమునూ రూ.20 నుంచి రూ.10కి తగ్గించారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు.