కేన్సర్.. మనుషులను కబళిస్తున్న మహమ్మారి. ముఖ్యంగా మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్ ఇందులో అగ్రభాగంలో ఉంది. ముందస్తు పరీక్షలతో తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే దీన్ని నివారించొచ్చు. ఓవైపు అవగాహన లేక.. మరోవైపు పరీక్షలకు తగిన ఆర్థిక స్తోమత లేక ఎందరో మహిళలు వ్యాధి ముదిరే వరకు గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే వ్యాధిని గుర్తించే టెక్నాలజీతో ప్రత్యేక జాకెట్లు, కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటితో పారిశుధ్య మహిళా కార్మికులకు రొమ్ము కేన్సర్ ఉచిత స్క్రీనింగ్లను జీహెచ్ఎంసీ చేపట్టింది.
కేన్సర్ నిర్ధారణకు రూపొందించిన ఈ ప్రత్యేక జాకెట్ను ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత ఆధారంగా వ్యాధిని ముందుగానే గుర్తించొచ్చు. ఈ జాకెట్ ధరించేందుకు ఇష్టపడని వారికి శరీరాన్ని తాకకుండానే దాదాపు ఒక అడుగు దూరం నుంచే స్క్రీనింగ్ చేసే కెమెరాను వినియోగిస్తారు. రేడియేషన్ ప్రభావం ఉండదు. కోత, గాట్లు వంటివి ఉండవు. నలభై ఏళ్లలోపు వారిలోనూ కేన్సర్ వచ్చే అవకాశాన్ని గుర్తించవచ్చు. శరీరాన్ని తాకకుండానే స్క్రీనింగ్, పూర్తి గోప్యత, కణతి ఏర్పడకముందే కేన్సర్ లక్షణాల్ని గుర్తించవచ్చు.