‘‘చిరంజీవి నటించిన 150 చిత్రాలు ఒక ఎత్తైతే.. ‘సైరా’ మరో ఎత్తు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తన సత్తా ఏంటో భారతదేశానికి చిరంజీవి చాటి చెప్పారు. ఇలాంటి కథతో సినిమా తీయడం పెద్ద సాహసం’. నిజాయతీగా చేసిన ప్రయత్నంలో చిరంజీవి సక్సెస్ అయ్యారు’’ అని టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు. బుధవారం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర యూనిట్ను సినీ, రాజకీయ ప్రముఖులు సమక్షంలో ఆయన అభినందించారు. అనంతరం సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ ‘‘బలమైన కథ, భారీ బడ్జెట్తో రామ్ చరణ్ లాంటి కుర్రాడు ఈ సినిమా నిర్మించాడంటే ఆశ్చర్యంగా ఉంది. 57 ఏళ్ల కెరీర్లో నేనెప్పుడు ఇలాంటి సాహసం చేయలేదు. ఈ కథతో పదేళ్లపాటు చిరంజీవి కోసం ఎదురుచూసిన పరుచూరి బ్రదర్స్కు హ్యాట్సాఫ్. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో వచ్చి తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి చాటి చెప్పాలి’’ అని అన్నారు.
‘‘సైరా’ సినిమా మొదలైనప్పటి నుంచి సుబ్బిరామిరెడ్డి తన దృష్టి ఈ సినిమాపై పెట్టారు. ఎప్పటికప్పుడు సినిమా విశేషాలు తెలుసుకునేవారు. పెద్ద హిట్ అవుతుందని ధీమాగా చెప్పేవారు. ఆయన కళా హృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఆయన ప్రేమ, అభిమానంతో నా గుండె నిండిపోయింది. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమాగా తెరకెక్కించిన సురేందర్రెడ్డికి ఎన్నిసార్లు అభినందనలు చెప్పినా తక్కువే ’’ అని అన్నారు. ‘‘చిరంజీవిగారు ఇచ్చిన సపోర్ట్, ధైర్యమే నన్ను ఇంతదూరం తీసుకొచ్చింది’’ అని దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు. ‘‘నేనేదో ఈ సినిమాకు నిర్మాతనని అందరూ గొప్పగా చెబుతున్నారు. కానీ నేను కూడా వర్కర్నే అని భావిస్తున్నా’’ అని రామ్ చరణ్ చెప్పారు.